Sunday, October 6, 2013

Srimadbhaagavathamu - Telugu Prose - Part 2

గజేంద్ర మోక్షము

త్రికూట పర్వతారణ్యములో ఒక గజరాజుండెను .అతనికి దశ లక్ష భార్యలు గలరు. అతడొకనాడు భార్యలతో అడవిలో దిరుగుచు దాహము వేసి, ఒక చెరువులో దిగి నీళ్ళు ద్రావి,కరిణులతో జలక్రీడలకు దిగి , చెరువు నంతను కలచి వేసెను .

ఆ చెరువులో ఒక పెద్ద మొసలి యున్నది .అది వచ్చి గజరాజు కాలు పట్టుకొనెను ఏనుగు విదిల్చి కొట్టెను .మొసలి మరల పట్టుకుని విడువలేదు ,లోపలికి లాగు చుండెను .గజము ఒడ్డునకు లాగుచుండెను. పోరు ఘోరమయ్యెను. వేయు ఏండ్లు గడిచెను . స్థాన బలము చేత నీటిలోని మొసలి మరింత విజ్రుంబించెను . గజరాజునకు బలము సన్నగిల్లెను .మొసలిని గెలవగలనా లేదా యని సందేహము కలిగెను. రక్షించు వారెవ్వరను కొనెను .పూర్వ సుకృతము వలన భగవంతుడు తప్ప మరొకడు రక్షకుడు లేడను స్థిర బుద్ది కలిగెను. అప్పుడు
శా || లావొక్కింతయు లేదు ధైర్యము విలో లంబయ్యే ప్రాణంబులన్
     రావుల్ దప్పెను, మూర్చ వచ్చే ,తనువుం డస్సెన్ శ్రమం బయ్యెడిన్
     నీవే తప్ప నితః పరం బెరుగ ,మన్నింప పంద గుందీ నునిన్
     రావే ! యీశ్వర ! కానవే వరద ! సంరక్షింపు భద్రాత్మకా !
అని మొర పెట్టుకొనెను .ఆ మొర విని విష్ణు దేవుడు కరిగి పోయెను. తాను విశ్వ మయుడు గాన ,గజేంద్రుని రక్షింప దలచెను.


అహంకారము జీవ లక్షణము .అది జీవుని అంత త్వరగా వదలదు .అది ఉండుట ,అవసరమే అయినను మితి మీర కూడదు. ఆత్మ రక్షణకై సకల జీవులు ప్రయత్నించును . అది తప్పు కాదు .తానే బలవంతుడను అను అహంకారము అనర్ధము తెచ్చును. గజేంద్రుడు తన్ను తాను రక్షించు కొనుటకై పోరాడునంత కాలమును శ్రీనాధుడు పట్టించు కొనలేదు. మన యవసరము లేదు లెమ్మని యూరకున్నాడు .

శ్రీ హరి గజరాజు మొర వినగానే ప్రక్కనున్న లక్ష్మీతో గూడ చెప్పకుండ పరుగుల మీద వచ్చి చక్రాయుధముతో మొసలి ని జంపి గజరాజును కాపాడినాడు.

అని శుకముని పరీక్షిత్తునకు జెప్పి ,"రాజా ! గజేంద్రుడు పూర్వ జన్మములో ఇంద్రద్యుమ్నుడను రాజు విష్ణు భక్తుడు ఒకనాడు అతడు శ్రీ హరి ధ్యానములో నుండగా అగస్త్యుడు అక్కడకు వచ్చెను. రాజతనిని జూడలేదు. అందుచే ఆ ముని కోపించి "నీవు మదముతో నాకు మర్యాదలు చేయ వైతివి కావున మద గజమవై పుట్టు "మని శపించెను. పూజించ దగిన మహాత్ములను పూజించ కుండుట శ్రేయో భంగ కరము కదా ! అట్లు ముని శాపమున ఆ రాజు గజరాజై పుట్టెను. పూర్వ జన్మ వాసన చేత మనసులో హరి భక్తి అంకురించి విష్ణుదేవుని యనుగ్రహమునకు పాత్రుడయ్యెను . మొసలి ,హు హూ అను గంధర్వుడు దేవలుని శాపముచే అట్లయ్యెను శ్రీ హరి చక్ర ధారచే చచ్చి పుణ్యగతికి పోయెను.

విషమ పరిస్థితులలో చిక్కుకున్న వారెవ్వరైనను ఈ గజేంద్ర మోక్షణ కధను భక్తితో చదివినను ,విన్నను సర్వాపదలు తొలిగి పోయి సుఖ పడుదురు .ఉత్తమ గతిని గజేంద్రుని వలె పొందుదురు .


క్షీర సాగర మధనము -కూర్మావతారము

ఒకనాడు దూర్వాసుడు స్వర్గలోకమునకు వెళ్ళుచు దారిలో ఊర్వశి మందార మాలతో కనబడగా ,మాలను తన కిమ్మని యడిగి పుచ్చుకొనెను .దాని నింద్రునికి కానుకగా నియ్యగా నతడు ఐరావతమున కిచ్చెను .అది మాలను పాడుచేసేను. దానికి ముని కోపించి ,"ఐశ్వర్య గర్వమున నన్నవమానించితివి కాన నీ యైశ్వర్యము సాగరములో కలియుగాక "అని శపించి వెళ్ళిపోయెను .ముని శాపమున ఇంద్రుని సర్వ సంపదలు నశించి పోయెను.బ్రహ్మ దగ్గరకు పోయి ప్రార్ధింపగా నతడు విష్ణువున కీ విషయము చెప్పి ఉపాయమును చెప్పమనెను .శ్రీనాధుడు ,"ఇంద్రుని సంపదలతో పాటు అమృతమును గూడ సాధించుటకు సముద్ర మధనము చేయవలెను. ఇది ఒక్క దేవతల వల్ల గాదు,రాక్షసులను గూడ అమృతము దొరుకునని యాస పెట్టి కలుపుకొనవలె "ననెను.
ఇంద్రుడు రాక్షస రాజైన ప్రహ్లాదుని యొద్ద కేగి ,"అప్ప సెల్లెండ్రా బిడ్డలము .మనలో మనకు భేదము లేల ? అమృతము సాధించుటకు పాల కడలిని మదింప వలెనని శ్రీహరి ఆనతిచ్చెను. మనమందరమును గలసి ఈ కార్యమును సాధింత "మని చెప్పి ఒప్పించెను.

దేవదానవులు మందర పర్వతమును కవ్వముగా దెచ్చి ,వాసుకి ని త్రాడుగా జేసి ,రాక్షసులు తలవైపునను ,దేవతలు తోక వైపునను పట్టుకుని పాలకడలిని మదింప సాగిరి .

వాసుకి సర్పము .పామునకు విషము తల యందుండును .అనగా అది మృత్యు స్వరూపము రాక్షసులు తామసులు తపస్సు పాప భూయిష్టము .దాని నణచి వేసిన గాని .లోకమందైనను మనసు నందైనను ప్రకాశము కలుగదు .
అందుచేత శ్రీ పతి రాక్షసులను మృత్యు స్వరూపమైన వాసుకి ముఖము దగ్గర నిలిపెను. ఈ రహస్యమును రాక్షసులు గ్రహింప లేక పోయిరి .

పర్వతము బరువుగా నుండి ,క్రింద ఆధారము లేక పోవుటచే సముద్రములో మునిగి పోయెను .దేవదానవులు ఏమి చేయవలెనో తోచక చూచు చుండిరి .అంతలో శ్రీ హరి లక్ష యోజనములు విస్తీర్ణము గల బొరుసుతో మహా కూర్మ రూపుడై కనబడెను.అతడు మందర గిరిని వాసుకి తో పాటు పైకెత్తెను. దేవదానవులు ఉత్సాహముతో సముద్రమును మదింప సాగిరి .

సముద్రము నుండి మొదట భయంకరమైన విషము పుట్టెను . ఈశ్వరుని ప్రార్ధింపగా ఆయన దానిని నేరేడు పండంత చేసి మ్రింగి కంటములో దాచుకొనెను. ఆయన కేమియు కాలేదు మృత్యుం జయుడు గదా !
మరల సురాసురులు సాగర మధనము చేసిరి .కామధేనువు పుట్టగా ఋషులు పుచ్చుకొనిరి. ఉచ్చైశ్రవమును బలిచక్రవర్తి తీసికొనెను . ఐరావతము నింద్రుడు తీసికొనెను .

కల్ప వృక్షము ,అప్సరసలు , చంద్రుడు పుట్టిరి .ఆ తరువాత లక్ష్మీ దేవి పుట్టెను .సంపదలకు తల్లి యని అందరు నామెను పూజించిరి .ఆమె విష్ణువును వరించెను.తుదకు ఆయుర్వేద విద్యా విశారదుడు అయిన ధన్వంతరి అమృత కలశములతో బుట్టెను .అసురులు వెంటనే అమృత కలశమును లాగుకొని పోయిరి .దేవతలు గోల పెట్టిరి .

విష్ణువు మోహిని యగుట

దేవతల ప్రార్ధనపై విష్ణువు దేవతలకు అమృతము పంచుటకై మోహినీ రూపము ధరించెను .రాక్షసులలో కలి గూడ ఉండెను. వాని చలువ వలన అమృతము కొరకు వారిలో వారికి కలతలు వచ్చెను. కొందరు ,దేవతలు గూడ సమాన భాగస్వాములే కావున వారికి గూడ సుధను పంచ వలెననిరి . మరికొందరు బలవంతులు అమృత పాత్ర నెత్తుకుని పోయిరి . వారి ముందు మోహిని అవతరించెను .

రాక్షసులు ఆమె వెంట బడిరి. ఆమె "అమృత కలశమును నాకిచ్చినచో అందరికి సమానముగా పంచెద " ననెను. వారిచ్చిరి .దేవతల నొక బంతి గాను ,రక్కసుల నొక బంతిగాను కూర్చుండ బెట్టి దేవతలకు అమృతమును పోయుచు, రాక్షసులను కన్ను గీటి ,పైట జార్చి ,మైమరపించు మాటలు చెప్పి 'ఇదిగో ,మీకును అమృతము పోయుచున్నా " నని యూరించు చుండెను .ఎదురు మాటాడినచో ఆమెకు తమపై ప్రేమ నశించునే మో యని రక్కసులూర కుండిరి .
రాహువు సూర్య చంద్రుల మధ్యకు రాగా వారు మోహినికి సంజ్ఞ తో తెలిపిరి .శ్రీ హరి చక్రముతో వాని తల తరిగెను. అమృతము కంటము లోనికి దిగుటచే వాడమరుడయ్యేను. బ్రహ్మ వానిని రాహు కేతువులను రెండు రూపములుగా జేసి గ్రహస్థానమున నిలిపెను.

మోహిని అమృత మంతయు దేవతలకే పోయుటచే రాక్షసులు కోపించి దేవతలతో దెబ్బలాటకు దిగిరి దేవదానవులకు మహా సంగ్రామ మయ్యెను .హరి కటాక్షము నొందిన దేవతలు గెలిచిరి .
సముద్ర మధనమున అంతరార్ధ మున్నది .సాధకుడు మంచి చెడ్డలు తేల్చు కొనుటకై మనసును మధింప వలెను. సిద్ధికై సాధన చేయుట కూడా మధనమే. అపుడు విషము వంటి విషమ పరిస్థితులు వానికెదురగును. వానిని లెక్క చేయక సాధన సాగించినచో కామధేనువు ,కల్ప వృక్షము వంటి చిన్న చిన్న లాభములు మనసును లాగుటకు
ప్రయత్నించును .వానితో తృప్తి పడినచో సాధన అక్కడితో ఆగి పోవును,అట్లు గాక ముందునకు సాగినచో అమృత (మోక్ష ) ప్రాప్తి కలుగును. జీవునకు మోక్షమే పరమావధి గదా !

వామనావతారము

బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు ఎంత దాన ధర్మ పరుడైనను దేవతల మీద గల సహజ విరోధము వలన వారిపై దండెత్తి స్వర్గ రాజ్యము నాక్రమించెను .దేవతలకు నిలువ నీడ లేకపోయెను .శ్రీ హరి దగ్గర మొర పెట్టుకొనగా ఆయన ," నేను వామనుడనై నీ సంపదలు తెచ్చి ఇచ్చెద " నని యింద్రు నోదార్చెను.
అదితి కశ్యపులకు విష్ణువు వామనుడై శ్రవణా నక్షత్రములో బుట్టెను .పుట్టగానే జ్ఞానవంతు డయ్యెను.
శ్రవణా నక్షత్ర జాతకులు త్రిలోకములందు ప్రసిద్దు లగుదురు .విష్ణువునకు శ్రోణ పత్ని వంటిది .("మహీం దేవీం విష్ణు పత్నీ మజూర్యాం "అని శ్రుతి) అంతే కాదు .పూర్వము విష్ణువు భూమిని ,దివిని ,అంతరిక్షమును వ్యాపించినట్లు ఈ నక్షత్రము గూడ అంతటి కీర్తిని గోరును .యజమానికి (ఆ నక్షత్రములో బుట్టిన వానికి ) అది సమకూర్చును గూడ అట్టినక్షత్రమున వామనుడు జన్మించెను. అతడు త్రిలోకములలో కూడ పాదములుంచుటలో ఆశ్చర్య మేమి ? ఈ విషయమునే శ్రుతి యిట్లు చెప్పుచున్నది :- "త్రేదావిష్ణురురు గాయో విచక్రయే ,మహీం దివం పృధివీ మంతరిక్షం ,తచ్చ్రో ణైతి శ్రవ ఇచ్చ మానా ,పుణ్య గ్గ్ శ్లోకం యజమానాయ కృణ్వతీ "అని
.
వామనుడు దాత లెచ్చట నున్నారని యడిగి ,బలిచక్రవర్తి మహాదాత యని విని వాని యొద్దకు వెళ్ళెను .బలిచక్రవర్తి యజ్ఞము చేయుచుండగా శాలలో ప్రవేశించి వామనుడు అందరితోను ముచ్చటించుచు పనసలు చదువుచు బలి దృష్టి నాకర్షించెను. వామనుడు బలి నాశీర్వ దించెను. బలి నమస్కరించి ,"నీవు వచ్చుటచే నా యజ్ఞము సార్ధకమైనది .నీవెవ్వరి వాడవు ? ఏమి కోరుదువో చెప్పు " మనగా వామనుడు " నేనందరి వాడను నాకు తపము చేసికొనుటకు మూడడుగుల నెల ఇచ్చినచో బ్రహ్మాండ మంతయు ఇచ్చినట్లు సంతోషింతు"ననెను .బలి ," నీకు అడుగుట కూడ చేతకాద " నెను. వామనుడు ,"నాకంత యాశ లేదు మూడడుగుల నేల చాలు "ననెను.
వామనుడు యీ డడుగులే కావలెనని అడుగుటలో ని విశేష మేమని పరీక్షిత్తు అడుగగా శుకుడిట్లనెను .
భూ: ,భువః ,సువః అని ప్రధాన వ్యాహృతులు మూడు .మొదట పుట్టినవీ లోకములే .వ్యాహృతులనగా చెప్పబడినవి అని యర్ధము .వీని నా పేరులతో పిలిచిరి .ఈ మూడును సర్వ లోకములకు ఉప లక్షణములు. వేదములు మూడు సత్వర జస్తమో గుణములు మూడు .త్రివిక్రముడనగా ఈ మూడు మూడుగా నున్న వానిపై ఆధిపత్యము గలవాడు. ప్రస్తుతము ఆ యాదిపత్యము బలిచక్రవర్తిది. దానిని స్వాదీనము చేసికొనుటకై మూడడుగులను అడిగెను. ఈ మూడడుగులను పై త్రి వర్గములకు ప్రతీకలు.
వామనునకు దాన మిచ్చుటకు బలి సిద్దపడగా శుక్రు డడ్డుకొని "ఈతడు వామన రూపుడైన శ్రీహరి .మూడడుగులు ఇచ్చినచో నీకు నిలువ నీడ లేకుండా జేయు "ననగా బలి, "నేను మాట తిరుగ లేను.

తన పత్ని వింధ్యావళి నీరు పోయగా ,"త్రిపాద ధరణిం దాస్యామి " అనుచు దాన ధార వామనుని చేతిలో వదలెను .వెంటనే వామనుడు ఇంతింతై ,అంతింతై పెరిగి సత్యలోకము దాకా వ్యాపించి ,తన తేజ శ్శరీరముతో ఒక పాదమును భూమిని ,రెండవ పాదమును ఆకాశమును ఆక్రమించి ,మూడవ పాదమునకు చోటేది ?" అని బలినడిగెను. బలి వింతగా చూసెను. "నాకియ్య వలసిన మూడవ అడుగు కొఱకు నిన్ను బంధించు చున్నా "నని వామనుడు బలిని పాశములతో బంధించెను . వింధ్యావళి పతి బిక్ష పెట్టమని ప్రార్ధించెను . బ్రహ్మ " దాన మిత్తునన్న యాతని నింక బంధించుట ఎందుకు ?" అని యడిగెను



చంద్ర వంశము

చంద్ర వంశంలో యయాతి యను రాజు గలడు. అతడు శుక్రుని కూతురు దేవయానిని పెండ్లాడెను .ఆమె వృష పర్వుడను రాక్షస రాజు కూతురును దాసిగా దెచ్చుకొనెను. రాజునకు దేవయాని వలన యదు ,తుర్వసులను కొడుకులు పుట్టిరి .

యయాతి దేవయానికి దెలియకుండ వృష పర్వుని కూతురు శర్మిష్టను పెండ్లాడెను .వారికి ద్రుహ్యుడు ,అనువు , పూరుడు అను కొడుకులు పుట్టిరి .దేవయానికి ఈ సంగతి తెలిసి తండ్రితో చెప్పెను. శుక్రుడు యయాతిని వృద్దుడవు గమ్మని శపించెను యయాతి తన కొడుకులను బిలిచి ముసలితనమును పుచ్చుకుని యౌవనము నిమ్మని యడిగెను. పై నలుగురును తిరస్క రించిరి .కనిష్టు డైన పూరుడు తండ్రికి తన యౌవన మిచ్చి వార్ధక్యమును పుచ్చుకొనెను. యయాతి తన మాట వినని పై నలుగురు కొడుకులను రక రకాలుగా శపించెను . అందులో పెద్దవానిని ,(యదువును ) నీ వంశము వారికి రాజ్యార్హత లేక పోవుగాక యని శపించెను.

యయాతి చాలాకాలము భోగములను భవించి విరక్తుడై ,పూరునకు తిరిగి యౌవన మిచ్చి వార్ధక్యమును తాను గ్రహించి ,తన రాజ్య మాతనికి ఇచ్చెను .పూరుని వంశములోని దుష్యంతుడు శకుంతలను కణ్వాశ్రములలో గాంధర్వ వివాహ మాడి ,ఆమె కుమారుడైన భరతునితో రాగా ,"మనకు సంబంధ మెక్కడిది పొమ్మ " నెను. ఆకాశవాణి చెప్పగా శకుంతలను పత్నిగాను ,భరతుని కొడుకుగాను స్వీకరించెను. భరతుడి తండ్రి తరువాత రాజై భూమండలమును బాలించెను . అతనికి ముగ్గురు భార్యలు . వారు తమకు బుట్టిన కొడుకులను భరతు నంతటి వారు కాలేరని చంపి వేసిరి. భరతుడు బృహస్పతి కొడుకు భరద్వాజుని వితదుడను పేరు పెట్టి తెచ్చి పెంచి రాజ్య మిచ్చెను. ఆ వంశముననే శంతనుడు పుట్టెను .

అతనికి గంగ యందు భీష్ముడును , సత్యవతి యందు చిత్రాంగద విచిత్ర వీర్యులును పుట్టిరి. విచిత్ర వీర్యునికి క్షేత్రజులై వ్యాసుని వలన ద్రుతరాష్ట్రుడు ,పాండు రాజు పుట్టిరి . ద్రుతరాష్ట్రునకు గాంధారి యందు దుర్యోదనాదులు వందమంది పుట్టిరి . పాండు రాజునకు కుంతీ మాద్రులందు ధర్మ ,వాయు ,ఇంద్ర , అశ్వినీ దేవతల ప్రసాదమున ధర్మరాజు ,భీమ , అర్జున, నకుల ,సహదేవులను పుట్టిరి .

శ్రీ కృష్ణావతారము
యయాతి జ్యేష్ట పుత్రుడు యదువు వంశము పవిత్ర మైనది . శ్రీహరి ఆ వంశ మందే కృష్ణుడుగా అవతరించెను. యదువంశమున దేవ మీడునికి వసుదేవుడు మున్నగు పదుగురు పుత్రులను కుంతీ మున్నగు ఐదుగురు పుత్రికలను పుట్టిరి. ఆ వసుదేవునకు దేవకీ యందు అష్టమ గర్భమున శ్రీకృష్ణుడు జన్మించెను. ఆయన కధలు విన్నవారికి సంసార దుఃఖ ములు తొలుగును.
ద్వాపర యుగములో చాలామంది రాజులు రాక్ష సాంశ ములతో బుట్టి ప్రజలను పీడించు చుండగా ,భూదేవి బ్రహ్మతో మొర పెట్టుకొనెను .ఆయన ," శ్రీహరి వాసుదేవుడుగా అవతరించి భూభారమును దీర్చు " నని చెప్పెను .
మధుర రాజధానిగా ఉగ్రసేనుడు మాదుర శూర సేనముల నేలు చుండెను. అతని కుమారుడు కంసుడు రాక్ష సాంశ గలవాడు .కూతురు దేవకి. ఆమెను వసుదేవునకు ఇచ్చి పెండ్లి చేసిరి. చెల్లెలిని అత్తవారింటికి పంపుచు కంసుడు గూడ వెంట వెళ్ళెను. దారిలో ఆకాశవాణి ,"నీ చెల్లెలి అష్టమ గర్భ సంజాతుని వలన నీకు చావుకలుగును "అని చెప్పగా వాడు చెల్లెలిని చంప బూనెను. వసుదేవుడు ,"ఆమెను జంప వల దనియు ,పుట్టిన బిడ్డలను నీ కప్పగింతు " ననియు ప్రార్ధింపగా వాడు విడిచెను.
తండ్రిని చెరలో బెట్టి కంసుడు గద్దె నెక్కెను .దేవకీ వసుదేవులకు వరుసగా ఆరుగురు మగ బిడ్డలు పుట్టిరి .వారిని కంసునికియ్యగా వాడు ,"వీరివలన నాకు హాని లేదు తీసికొని పొ"మ్మనెను. ఆమె అట్లే చేసెను . దేవకికి ఏడవ గర్భము రాగా శ్రీహరి మాయాదేవిని బిలిచి ," ఈ దేవకి కడుపులోని పిండమును వసుదేవుని మరొక భార్యయైన రోహిణి గర్భములో నుంచు "మనెను. ఆమె అట్లే చేసెను .దేవకికి గర్భ స్రావ మయ్యెనని అందరును అనుకొనిరి. నారదుడు ఒకనాడు కంసుని యొద్దకు వచ్చి, "నీవు రాక్షసుడవు వసుదేవాదులు దేవతలు చక్రి దైత్య సంహారము చేయుటకు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భమున బుట్టు "నని చెప్పగా వాడు దేవకీ వసుదేవులను చెరలో బెట్టి ,వారి ఆరుగురు పుత్రులను ఒక్కసారే వధించెను .దేవకి ఎనిమిదవ సారి గర్భము దాల్చినది .ఆమెకు శ్రావణ బహుళాష్టమి రాత్రి రోహిణీ నక్షత్రమున మేనమామ గండములో శ్రీ కృష్ణుడు జన్మించెను. విష్ణు నాజ్ఞ పై మాయాదేవి యశోదకు పుత్రికగా జన్మించెను .శ్రీ కృష్ణుని ప్రేరణతో వసుదేవుడు ఆ రాత్రి యమునను దాటి శ్రీకృష్ణుని యశోద ప్రక్కలో పరుండబెట్టి మాయాదేవిని తీసికొని వచ్చెను. దేవకి ప్రసవించిన వార్త కంసునికి దెలిసి వచ్చి ఆడపిల్ల అనియైన చూడక చంపబోవగా మాయాదేవి " నిన్ను చంపువాడు పుట్టినాడు లె" మ్మని చెప్పి అద్రుశ్యు రాలయ్యెను.
కంసుడా మాటలు విని పశ్చాత్తాపముతో దేవకీ వసుదేవులను జూచి, "నేను మీకు చాలా దుఃఖము కలిగించినాను .నన్ను మన్నింపు "డని వారిని విడిచిపెట్టెను .

No comments:

Post a Comment